Monday, April 23, 2012

తొలి తెలుగు వాగ్గేయ కారుడు - కృష్ణమయ్య

ఒక బాలుడు.. ఉత్తమ సంస్కారమూ, పాండిత్యమూ, దైవభక్తీ ఉన్న కుటుంబం లో పుట్టినవాడు.. అంధత్వం తో జన్మించిన విధి వంచితుడు... కన్నవారి చేతే, ఎవరో చెప్పిన మాటలు నమ్మి దురదృష్ట జాతకుడిగా ముద్రపడి,    వద్దనుకొని పాడుపడ్డ బావిలో పారవేయ బడ్డవాడు. విధి విరిచేసిన ఆ బాలుడి జీవితాన్నిసింహగిరిపై కొలువున్న శ్రీ వరాహ నృసింహ స్వామి దరి చేర్చాడు. 12 - 13  వ శతాబ్దాలకు చెందిన ఆ బాలుడే పెరిగి పెద్దవాడై సింహగిరి నరహరి వచనములు వ్రాసి శ్రీకంఠ కృష్ణమాచార్యులు లేదా కృష్ణమయ్య గా ప్రసిద్ది కెక్కాడు. ఆ అంధ బాలుడిని బావిలో తీగలమధ్య వ్రేలాడుతుండగా చూసిన శ్రీమాన్ కృష్ణ కుమార స్వామి అనే గురువుగారు తమ వద్దకు చేర్చుకొన్నారు. గురువుగారి  పెంపకం లోనే కాస్త పెద్దవాడయాడు.
ఒకనాడు గురువుగారితో కలసి సింహగిరి పుణ్య క్షేత్రానికి వెళ్ళాడు. గురువుగారు మన క్రిష్ణమయ్యని కొండదిగువనే మఠంలో ఉంచి, వారు నరహరి దర్శనార్థం కొండపైకి వెళ్ళారు. ఆ వెళ్ళడం మూడురోజుల పాటూ ఉండిపోయారు. చిన్నతనం నుండీ గురువుగారినే నమ్ముకొని ఉన్న క్రిష్ణమయ్యకు ఈ ఎడబాటు దుర్భరం అయిపొయింది. ఆకలి దప్పులు చూసేవారు లేకపోయారు. కానీ ఏదిక్కూ లేనివాడికి ఆ దేవుడే దిక్కు అన్నట్లు నరసింహస్వామి కరుణా కటాక్ష వీక్షణాలు ఆ బాలుడిపై పడ్డాయి. బాలుని రూపం లో వచ్చిన స్వామి చిన్న గిన్నెతో పాలు తెచ్చి తాగమన్నారట. త్రాగిన పిదప ఆ పాలతో తడిసిన చేతులతో కంటినీరు తుడుచుకోగా చూపు వచ్చిందట. అప్పుడు బాలుని రూపం లోఉన్న స్వామే తన కాళ్ళపై పడిన కృష్ణమయ్యను పైకి లేపి, తనను చాతుర్లక్ష సంకీర్తనా వచనాలతో పూజించమని ఆజ్ఞాపించాడట.
అప్పటినుంచీ క్రిష్ణమయ్య సింహాచలం లోనే నివసిస్తూ సింహగిరి నరహరి వచనములు వ్రాసి శ్రీ వరాహ నారసింహుని పరవశింప జేసి బాలుని రూపం లో నాట్యమాడేలా  చేసిన భక్తాగ్రగణ్యుడయ్యాడు.  స్వామివారి పదకొండవ అవతారంగా కొనియాడబడిన భక్తులచే కృష్ణమయ్య తొలి తెలుగు వాగ్గేయ కారుడిగా ఖ్యాతికెక్కాడు.  
జనవరి 2000 వ సంవత్సరం లో ముద్రించబడిన ఈ పుస్తక రచయిత శ్రీమాన్ టి పి శ్రీరామ చంద్రాచార్యుల వారు... మరుగున పడిపోయిన శ్రీ కృష్ణమయ్య జీవిత చరిత్రనూ, వారి సింహగిరి నరహరి వచనాలనూ వెలుగులోకి తేవడానికి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చీ, తంజావూరు సరస్వతీ మహల్లో తాళపత్రాలలోనూ , ఇదివరకు ముద్రితమైన గ్రంధాలలోనూ దొరికిన కొద్దిపాటి వచనాలనే గంగాజలాన్ని మనకు అందుబాటులోకి తెచ్చిన అపర భగీరథుడు.  236  పేజీల ఈ గ్రంధం దొరకు చోటు :
టి. పి. శ్రీరామ చంద్రాచార్యులు
7 - 48, బృందావని
సింహాచలం,
విశాఖపట్నం - 530028
ఫోను : 0891-2715427

టి టి డి వారు అన్నమాచార్య ప్రాజెక్టు నెలకొల్పి ఆయన కీర్తనలకు బహుళ ప్రచారం కల్పించినట్టే సింహాచలం దేవస్థానం వారు కూడా కృష్ణ మయ్య పేరుపై ఒక ప్రాజెక్టు రూప కల్పన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అది త్వరలో సాకారమవ్వాలని ఆశిద్దాం.
శ్రీ సింహాద్రి నాథుని చందన యాత్ర సందర్భం గా మిత్రులందరికీ శుభాకాంక్షలు.














ఈ వాగ్గేయకారుని గురించిన మరిన్ని లింకులు: 
వెలుగులోకి కృష్ణమయ్య కీర్తనలు - ఆంధ్రప్రభ
అన్నమయ్యకు ముందే కృష్ణమయ్య? - ప్రజాశక్తి
Vaartha : చీకట్లో కృష్ణమయ్య
Veyyellanaati mana krishnamayya: తొలి తెలుగు పదకర్త ... 
Andhra Bhoomi

No comments:

Post a Comment

* దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
* వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!